Breaking News

గిరిపుత్రులకు భూమిపై హక్కు

గిరిపుత్రులకు భూమిపై హక్కు

సారథి న్యూస్​, శ్రీశైలం/ కర్నూలు: దశాబ్దాల కాలం నుంచి పెండింగ్​లో ఉన్న గిరిజన భూముల భూవివాదాలకు ఆస్కారం లేకుండా అటవీహక్కుల చట్టం మేరకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ కింద రాష్ట్రంలో 1.53 లక్షల మంది గిరిజన రైతులకు 3.12లక్షల ఎకరాల భూమిపై హక్కు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్​మోహన్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అడవులు, కొండ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజన రైతుకు భూమి హక్కు పత్రాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల కోసం పాడేరులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ, ఐదు ఐటీడీఏల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ కు శంకుస్థాపన చేశారు. కర్నూలు, గుంటూరు, ప్రకాశం మూడు జిల్లాల్లో ఐటీడీఏ కింద 2400 ఎకరాల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ అటవీ భూములను 1,335 మందికి భూమిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ జి.వీరపాండియన్​, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదిబాయి, ఈదమ్మ, దేవిబాయి, నాగమ్మకు అటవీ భూమి హక్కు పత్రాలను పంపిణీచేశారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌(సంక్షేమం) సయ్యద్‌ ఖాజా మోహిద్దీన్‌, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి, ఆత్మకూరు డీఎఫ్‌వో కిరణ్‌ పాల్గొన్నారు.

వీడియాకాన్ఫరెన్స్​లో పాల్గొన్న కలెక్టర్​, అధికారులు