![ఆగస్టులోనైనా బొమ్మ పడేనా.. ?](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/min.jpg?fit=1200%2C650&ssl=1)
కరోనా మహమ్మారి, తదనంతర లాక్ డౌన్ పరిస్థితులు సినిమా రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. షూటింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పాటు. థియేటర్లు మూతపడ్డాయి. కొన్ని నిబంధనలతో చిత్రీకరణలకు ఇటీవల అనుమతి లభించినప్పటికీ. థియేటర్లు మాత్రం ఇంకా తెరుచుకోలేదు. అయితే వాటికి కూడా అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆగస్టులో సినిమా థియేటర్లను తెరవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ. హోంశాఖకు సిఫార్సు చేసింది. సీఐఐ మీడియా కమిటీ సమావేశంలో ఐ అండ్ బీ కార్యదర్శి అమిత్ ఖారే ఈ విషయాన్ని తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 1 నాటికి లేదా ఆ నెలాఖరుకైనా సినిమా హాళ్లను దేశవ్యాప్తంగా తిరిగి తెరవడానికి అనుమతించాలని సిఫార్సు చేసినట్లు ఖారే పేర్కొన్నారు.థియేటర్లలో కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మొదటి వరుసలో సీటు విడిచి సీటుకు అనుమతి ఇవ్వడం. ఆ తర్వాతి వరుసను ఖాళీగా ఉంచడం. ఇదే నిబంధన థియేటర్ అంతా అమలు చేయాలనే ఫార్ములాను సూచించినట్లు పేర్కొన్నారు.