Breaking News

మీకు నైతికహక్కు లేదు

మీకు నైతికహక్కు లేదు
  • రాజ్యాంగ నిబంధనలకు మోడీ సర్కార్‌ తూట్లు
  • అందుకే మేము పాల్గొనడం లేదు: మాయావతి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించే నైతిక హక్కు లేదని, అందుకే ఈ కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనడం లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని ఆరోపించారు. భారత రాజ్యాంగాన్ని పూర్తి నిబద్ధతతో అనుసరిస్తున్నామా? అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో సమీక్షించుకోవాలని హితవు పలికారు. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రయోజనాలు ఆయావర్గాలకు చేరడం లేదని మాయావతి ఆందోళన వ్యక్తంచేశారు. ప్రైవేట్‌ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పన దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా ఎలాంటి చట్టాలను తీసుకురావడం లేదని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పి వారి లబ్ధి కోసం అవసరమైన అన్ని చర్యలూ చేపట్టాలని మాయావతి డిమాండ్‌ చేశారు.