Breaking News

నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

నాగార్జునసాగర్‌ లో కారుదే జోరు

  • టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ విజయం
  • కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి ఓటమి
  • డిపాజిట్ దక్కించుకోని బీజేపీ
    సారథి, నాగార్జునసాగర్​: నాగార్జున‌సాగర్ ఉపఎన్నికలో కారు జోరు కొనసాగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ 18వేల పైచిలుకు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. దీంతో జానారెడ్డి వరుసగా మూడోసారి ఓటమిపాలయ్యారు. బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ సైతం దక్కలేదు. ఎమ్మెల్యే నోముల నర్సింహాయ్య మరణంతో సాగర్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కుమారుడు భగత్ కుమార్ టీఆర్ఎస్ తరపున పోటీచేసి సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డిపై 18,872 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అభ్యర్థులు ఎవరివారు ప్రచారాస్త్రాలను సంధించారు. ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరకు విజయం టీఆర్ఎస్‌ను వరించింది.
    టీఆర్ఎస్‌కు 89,804 ఓట్లు
    నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 2,20,206 మంది ఓటర్లు ఉండగా 1,89,782 ఓట్లు పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 89,804 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డికి 70,932 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 7,676 ఓట్లు, టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్ కుమార్ 1,714 ఓట్లు వచ్చాయి. 1384 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండగా, ఇందులో 51 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగిలిన ఓట్లలో టీఆర్ఎస్‌కు 822, కాంగ్రెస్‌కు 428, బీజేపీకి 30, టీడీపీకి 6 ఓట్లు పడ్డాయి.
    సాగర్​ లో బీజేపీ బోల్తా
    నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌లో బీజేపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవ‌లం 7,676 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రవికుమార్ డిపాజిట్‌ను సైతం ద‌క్కించుకోలేక‌పోయారు. రెండు హాల్స్‌లో 14 టేబుళ్ల మీద 25 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగితే.. ఏ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యం చూపలేక చతికిలపడింది. ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి ర‌వినాయ‌క్ ఏడుస్తూ, ఓట‌ర్లను ఆక‌ర్షించేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. గుర్రంపోడు మండలంలో 3,008 ఓట్లు, పెద్దవూరలో 4,640, తిరుమలగిరిలో 2,713, నిడమనూరులో 5,642 ఓట్ల లీడ్‌‌ను టీఆర్ఎస్ సాధించగా అనుములలో కాంగ్రెస్ 447 ఓట్ల ఆధిక్యంలో నిలిచింది.
    సాగర్ ​ప్రజలకు ధన్యవాదాలు
    నన్ను గెలిపించిన నాగార్జున‌సాగర్​ప్రజలు, నాకు టికెట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు. నాగార్జునసాగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తా. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తా.
    :: నోముల భగత్​
    ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తాం
    ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ నెరవేరుస్తాం. నోముల భగ‌త్‌ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు సాగర్ నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్‌తోపాటు నియోజకవర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. దేవరకొండ, నాగార్జున‌సాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు ఇటీవల మంజూరుచేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరు అందిస్తాం. ఘన విజయం సాధించిన నోముల భగత్‌కు హృదయ పూర్వక అభినందనలు.
    :: సీఎం కేసీఆర్​