Breaking News

ముహూర్తం ఖరారు!

– కాంగ్రెస్‌లోకి పొంగులేటి, జూపల్లి
– పార్టీలో చేరడంపై స్పష్టత ఇచ్చిన నేతలు
– 30న కాంగ్రెస్‌ ఖమ్మం సభలో చేరిక

సామాజికసారథి, హైదరాబాద్‌: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఆయన ఏ రోజు కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే దానిపై కూడా స్పష్టత వచ్చింది. ఈ నెలాఖరున అంటే జూన్‌ 30న పొంగులేటి కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కృష్ణారావు తదితరులు కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. ఈనెల 22న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పొంగులేటి, జూపల్లి, కూచూకుళ్ల దామోదర్​ రెడ్డి, పిడమర్తి రవి తదితరులు భేటీ కానున్నారు. భేటీ అనంతరం తెలంగాణలో వేర్వేరు బహిరంగ సభల్లో పలువురు నేతలు కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈనెల 30న ఖమ్మంలో భారీ బహిరంగ సభకు కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది. ఖమ్మం సభలో పొంగులేటి తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనుంది. ఈ సభకు రాహుల్‌ గాంధీ లేదా ప్రియాంకగాంధీ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పొంగులేటితో పాటు పాయం వేంకటేశ్వర్లు, కోరం కనకయ్య, పిడమర్తి రవి, తెల్లం వెంకట్రావు, బానోత్‌ విజయాబాయి, కోటా రాంబాబు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, కొండూరి సుధాకర్‌, జారే ఆదినారాయణ, దొడ్డా నగేష్‌ యాదవ్‌ హస్తం పార్టీలో చేరనున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో జూపల్లి తదితరులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారు. జూపల్లితో పాటు దామోదర్‌ రెడ్డి, మేఘారెడ్డి, కుచ్చారెడ్డి తదితరులు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.