Breaking News

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు

ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు తీపికబురు
  • సర్వీస్‌ క్రమబద్ధీకరిస్తామని ఎండీ సజ్జనార్​భరోసా

సామాజికసారథి, హైదరాబాద్‌: కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తీపికబురు అందించారు. ఎన్నో ఏళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న వారిని రానున్న రోజుల్లో పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామని భరోసాఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని సజ్జనార్‌ ప్రకటించారు. ‘సంస్థ అభివృద్ధి చెందితే.. మనందరం బాగుపడతాం. టీఎస్‌ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు.. మనందరిదీ. ఇందులో ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఉన్నన్ని రోజులు సంస్థ అభివృద్ధి కోసం కృషిచేయాలి’ అని సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది పెండింలో ఉన్న ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా, కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్‌ చెప్పారు. రానున్న రోజుల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు శాశ్వతంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని.. దీని వల్ల టీఎస్‌ఆర్టీసీ అక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.