Breaking News

సుంకిరెడ్డికి హ్యాండిచ్చారు..!

‘సుంకిరెడ్డి’కి హ్యాండిచ్చారు..!
  • ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికే టికెట్
  • హస్తం గూటికిచేరినా లభించని హామీ
  • కల్వకుర్తిలో రసవత్తరంగా రాజకీయం

సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ ఎన్ఆర్ఐ, ఐక్యతా ఫౌండేషన్ ఛైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆదిలోనే నిరాశే ఎదురైంది. దీంతో చేసేదిలేక దిక్కుతోచనిస్థితిలో పడ్డారు. కాంగ్రెస్​ అధిష్టానం కల్వకుర్తి టికెట్​ను ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఖరారుచేసింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​లో చేరారు. గతంలో ఆయన కల్వకుర్తి నుంచి పోటీచేద్దామని భావించినా బీఆర్​ఎస్​ టికెట్​ రాలేదు. 2023 ఎన్నికల్లోనూ మరోసారి నిరాశే ఎదురుకావడంతో కాంగ్రెస్​ గూటికి చేరారు. దీంతో ఆయనకు ‘హస్తం’ అధినాయత్వం టికెట్​ను ఖరారుచేసింది. తాజా జాబితాలో ఆయన పేరు వెల్లడైంది. కాగా, కాంగ్రెస్​ టికెట్​ తనకే వస్తుందని సుంకిరెడ్డి రాఘవేందర్​రెడ్డి బాగా నమ్మకంతో ఉన్నారు. ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంబులెన్స్ ల​ను ఏర్పాటుచేసి పేదలు ఆస్పత్రులకు వెళ్లేలా సదుపాయం కల్పించారు. అలాగే కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్లు, మాడ్గుల మండల కేంద్రాల్లో పార్టీ ప్రచార కార్యాలయాలను ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి ద్వారా టికెట్​ కోసం తీవ్రంగా యత్నించారు. అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో డీలాపడిపోయారు. కొద్దిరోజులుగా ఆయన సైలెంట్​ అయిపోయారు. కాగా, ఎన్నికల వేళ ఆయనకు బీఆర్ఎస్​ గాలం వేసినట్లు తెలిసింది. అయితే ఈ ఎన్నికల్లో సుంకిరెడ్డి రాఘవేందర్​ రెడ్డి కాంగ్రెస్​లో ఉండి కసిరెడ్డి నారాయణరెడ్డి గెలుపునకు పనిచేస్తారా? స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేస్తారా? లేదా ఇతర పార్టీలోకి మారుతారా? అన్నది కాలమే నిర్ణయించాలి.