- మృతుల్లో ప్రభుత్వ టీచర్తో భార్య మృతి
- మెదక్ జిల్లా నర్సాపూర్ లో సమీపంలో ఘటన
సామాజికసారథి, మెదక్ బ్యూరో: ఓ డీసీఎం మృత్యువులా దూసుకొచ్చింది. డ్రైవర్ అజాగ్రత్త, నిర్లక్ష్యంగా నడపడంతో ఇద్దరు దంపతులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరు ప్రభుత్వ టీచర్, ఆయన భార్య ఉన్నారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం..చిలప్ చెడ్ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్(38), ఆయన భార్య అమృత (33) ఓ భార్య బైక్ పై ఓ శుభకార్యం కోసం నర్సాపూర్ వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనం డ్రైవర్ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా రాంగ్ రూట్ లో నడిపి రెడ్డిపల్లి వద్దకు రాగానే ఢీకొన్నది. ఈ దుర్ఘటనలో దంపతులిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. సంఘటనస్థలం హృదయవిదాకరంగా మారింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతుడి తల్లి కేలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి నర్సాపూర్ ఎస్సై శివకుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
రహీంగూడ కన్నీటిసంద్రం
చిలప్ చెడ్ మండలం రహీంగూడకు చెందిన నునావత్ రవీందర్ శివంపేట మండలం పిలుట్ల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య అమృత గృహిణి. రవీందర్ కూతురు కృష్ణప్రియ(11) తూప్రాన్ ఒలంపియాడ్ స్కూల్లో ఐదో తరగతి పూర్తిచేసింది. రవీందర్ కొడుకు సాయి ధనుష్ నర్సాపూర్ గీత స్కూలులో మూడవ తరగతి చదివాడు. పిల్లలు అనాథలుగా మారడంతో కుటుంబసభ్యులు, బంధువులు, తండావాసులు కన్నీరుమున్నీరయ్యారు. రవీందర్ మృతిచెందడంతో నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై చాలా సేపు ధర్నా చేశారు. అందరి మధ్య వారికి కన్నీటి వీడ్కోలు పలికారు.