Breaking News

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌

ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌
  • జాక్‌ డోర్స్‌ స్థానంలో నియామకం
  • పరాగ్‌కు అభినందనలు తెలిపిన కేటీఆర్​

న్యూయార్క్‌: మొన్న మైక్రోసాప్ట్‌.. నిన్న గూగుల్‌.. నేడు ట్విట్టర్‌.. గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ట్విట్టర్‌ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్‌ కొత్త సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. సీఈవోగా ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే సోమవారం దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్‌ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. 2006లో మరో ముగ్గురితో కలిసి డోర్సే ట్విట్టర్‌ను స్థాపించారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ట్విట్టర్‌ సారథిగా డోర్సేనే కొనసాగుతున్నారు. దాదాపు 16 ఏళ్ల అనంతరం సంస్థకు కొత్త సీఈవో రాగా అదికూడా ఓ భారతీయుడికి అవకాశం లభించడం గమనార్హం. కాగా, 2022లో జరిగే సంస్థ వాటాదారుల సమావేశం వరకు డోర్సే ట్విట్టర్‌ బోర్డులో సభ్యుడిగా కొనసాగనున్నారు. ఐఐటీ బాంబే, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన పరాగ్‌ అగర్వాల్‌.. పదేండ్ల క్రితం ట్విట్టర్‌లో యాడ్స్‌ ఇంజినీర్‌గా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2017లో సంస్థ టెక్నాలజీ అధిపతిగా పదోన్నతి పొందారు. ఇప్పుడు సీఈవోగా ఎన్నికయ్యారు. గతంలో మైక్రోసాప్ట్‌, యాహూ తదితర సంస్థల్లోనూ పనిచేశారు.

గర్వంగా ఫీలవుతున్నా: పరాగ్​
‘ఈ బాధ్యత నాకు రావడం పట్ల గర్వపడుతున్నాను. డోర్సే మార్గదర్శకత్వాన్ని కొనసాగిస్తాను. ఆయన స్నేహానికి కృతజ్ఞతలు’ అని ఈ సందర్భంగా పరాగ్‌ అన్నారు. ‘సహ వ్యవస్థాపకుడిగా ట్విట్టర్‌తో మొదలైన నా ప్రయాణం సుమారు 16 ఏళ్లుగా కొనసాగింది. ఇప్పుడిక సంస్థను వీడాలని నిర్ణయించుకున్నా. పరాగ్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. సంస్థలో చేరిన పదేళ్ల కాలంలోనే పరాగ్‌ అగర్వాల్‌ ఉన్నత పదవిని చేపట్టారు.’ అని ట్విట్టర్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే ప్రశంసలు కురిపించారు. పరాగ్​అగర్వాల్​కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా ట్విట్టర్‌ ద్వారా పరాగ్‌ అగర్వాల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.