Breaking News

నాగర్‌కర్నూల్ టికెట్ మాదిగలకే

  • సీఎం రేవంత్‌రెడ్డి, అధిష్టానం హామీ ఇచ్చింది
  • కొందరిది వ్యక్తిగత ప్రచారమే..
  • మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్

సామాజికసారథి, నాగర్ కర్నూల్‌బ్యూరో: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ మాదిగలకే వస్తుందని ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్ మాజీఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ ధీమా వ్యక్తంచేశారు. టికెట్ తమకే వస్తుందని కొందరు చేసుకుంటున్న ప్రచారం వారి వ్యక్తిగతమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర జనాభాలోని ఎస్సీ ఉపకులంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగ సామాజికవర్గానికే సీటు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పా పెద్దలు చెప్పారని గుర్తుచేశారు. ఆదివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టెం వేంకటేశ్వరస్వామి ఆలయానికి పాదయాత్రగా వెళ్లి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్ మాదిగలకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనకు రాకపోయినా తన సామాజికవర్గంలో ఎవరికి వచ్చినా గెలుపు కోసం సపోర్టు చేస్తానని స్పష్టం చేశారు. ఎంపీ టికెట్ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పార్టీ అధిష్టానం కూడా తనకే మద్దతుగా ఉందని ప్రస్తావించారు. నాగర్‌కర్నూల్ సీఎం రేవంత్‌రెడ్డి సొంత పార్లమెంట్ సెగ్మెంట్ అయినందున ఎక్కువ మెజార్టీని అందించాలని ప్రజలను కోరారు. ఆయనకు నైతిక ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేశ్‌రెడ్డి గెలుపు కోసం కృషిచేసిన మాదిరిగానే ఎంపీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఎస్.సంపత్‌కుమార్ కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చారకొండ వెంకటేశ్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ కొడిదల రాము, సేవాదళ్ జిల్లా ప్రెసిడెంట్ మల్లేష్, వెంకటస్వామి, రాములు, గోవింద్ రామకృష్ణ, అమృతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.