Breaking News

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం
  • అవగాహన కల్పించేందుకు సిద్దిపేటలో హాఫ్ మారథాన్
  • రన్నింగ్ పోటీలను ప్రారంభించిన సిద్దిపేట సీపీ డి.జోయల్ డేవిస్, ఎమ్మెల్యే సతీశ్ కుమార్

సారథి న్యూస్, హుస్నాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డి.జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. 32వ రోజు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా హుస్నాబాద్ లో జిల్లాస్థాయి హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీలు నిర్వహించారు. సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి ఉత్సాహవంతులైన యువతీ యువకులు పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి సీపీ మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతుందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై వంటి పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువతి, యువకులను ప్రోత్సహించేందుకు హుస్నాబాద్ ఏసీపీ మహేందర్, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సైలు శ్రీధర్, రవి, రాజుకుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కృషిచేస్తున్నారని అన్నారు. ఏటా రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నారన్నారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోవడంతో భార్య, పిల్లలు రోడ్డున పడుతున్నారని తెలిపారు.

హాఫ్ మారథాన్ రన్నింగ్ పోటీల్లో పాల్గొన్న యువకులు

మూడు విభాగాల్లో పోటీలు
రన్నింగ్ పోటీలను 21కే, 10కే, 5కే మూడు విభాగాలుగా నిర్వహించారు. అందులో 21కే రన్నింగ్ రేస్​లో 284 మంది, 10 కే రన్నింగ్ పోటీలో 173 మంది, 5కే రన్నింగ్ పోటీలో 513 మంది పాల్గొన్నారు. అందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతి, యువకులు 1,052 మంది పోటీలో పాల్గొన్నారు.

విజేతలు వీరే..
21 కే రన్నింగ్ పోటీలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామానికి చెందిన పోడర్ల అభిషేక్ కు ప్రథమ బహుమతి రూ. 25వేల నగదు, ద్వితీయ బహుమతి అక్కన్నపేట మండలానికి చెందిన భుక్యా చంద్రశేఖర్ కు రూ.15వేల నగదు, గుడాటిపల్లికి చెందిన మిట్టపల్లి దామోదర్ కు రూ.10వేల నగదు అందజేశారు. 10కే రన్ లో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సలికంటి అఖిల్ కు రూ.15వేల నగదు, ద్వితీయ బహుమతి వంగల ధనుష్ రూ.10వేల నగదు, తృతీయ బహుమతి అక్కన్నపేట మండలానికి చెందిన బైరి అఖిల్ రూ.ఐదువేల నగదు అందించారు. 5 కే రన్లో భాగంగా అక్కన్నపేట మండలానికి చెందిన బోనాల వినోద్ కు ప్రథమ బహుమతి రూ.ఐదువేలు, ద్వితీయ బహుమతి గుగులోత్ నరేష్ రూ.2500 నగదు, నంగునర్ మండలం ముండ్రాయికి చెందిన పి.శ్రీకాంత్ కు రూ.1500 నగదుతో పాటు పోటీలో పాల్గొన్న విజేతలకు జడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మార్కెట్ చైర్మన్ అశోక్ బాబు, మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, ఎంపీపీలు మానస, లక్ష్మి, జడ్పీటీసీ మంగ, స్థానిక కౌన్సిలర్లు, డివిజన్ పరిధిలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పోలీస్ ఉన్నతాధికారులు అంజేశారు.