Breaking News

కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్లు ఓకే!

కూచకుళ్ల, కసిరెడ్డి నామినేషన్లు ఓకే!

సామాజిక సారథి, నాగర్​కర్నూల్ ప్రతినిధి: మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు నామినేషన్లు ఆమోదం పొందాయి. ఆరు తిరస్కరణకు గురయ్యాయని మహబూబ్​నగర్​జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ఎస్.వెంకట్రావు తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్​నగర్ ​కలెక్టరేట్ లో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ.శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో నామినేషన్లను పరిశీలించారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి రెండు స్థానాలకు గాను మొత్తం 10మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థులు కూచకుళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి నామినేషన్లతో పాటు మరో ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించారు. వారిలో ఫరూక్ నగర్ మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్ కర్నూల్​జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్లు ఉన్నాయి.
తిరస్కరించిన వారు
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన సారాబాయి కృష్ణ, షేక్ రహీంపాష, మహమ్మద్ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు తెలిపారు.