Breaking News

పదవుల పందేరం

పదవుల పందేరం
  • టీఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత సందడి
  • పార్టీ పదవులు, ప్రభుత్వ నియామకాలపై ఆశ
  • అధినేత కరుణ కోసం ఆశావహుల ఎదురుచూపు
  • 2023 సాధారణ ఎన్నికల్లోగా దక్కించుకోవాలని పట్టుబడుతున్న నేతలు
  • ఈనెల 15న ముగియనున్న ఎమ్మెల్సీ కోడ్​

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ముగియనున్న వేళ సంస్థాగత పదవుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నియామక ప్రక్రియ ఇప్పటికే పలు కారణాలతో వాయిదాపడిన విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్​పార్టీలో శాసనమండలి సభ్యత్వాన్ని ఆశించి అవకాశం రానివారు అటు వైపు ఆశగా చూస్తున్నారు. పలు కార్పొరేషన్ల పాలకమండళ్లు ఖాళీగా ఉండటంతో తమ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే 2023 సాధారణ ఎన్నికల్లోపు పదవియోగం పొందడానికి ఇదే చివరి అవకాశమని పట్టుబడుతున్నట్లు తెలిసింది.

సామాజిక సారథి, హైదరాబాద్‌: ఇక అన్ని ఎన్నికలు ముగియడంతో పార్టీ పదవులు, కార్పొరేషన్‌ తదితర పదవులపై టీఆర్‌ఎస్‌ నేతలు ఆశగా చూస్తున్నారు. రాష్ట్రంలో 80కిపైగా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు సంబంధించిన కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 35 కార్పొరేషన్లకు మాత్రమే పాలక మండళ్లు ఉన్నాయి. కీలక కార్పొరేషన్ల పాలకమండళ్లు ఖాళీగా ఉండటంతో తమకు అవకాశం ఇవ్వాలని నేతలు కొందరు సంబంధిత జిల్లా మంత్రులు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, అధినేత కేసీఆర్‌ల దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారని పొలిటికల్​జంక్షన్​లో టాక్​నడుస్తోంది.గులాబీ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో వరంగల్‌లో తెలంగాణ విజయగర్జన సభ నిర్వహించాలని భావించినా ఇప్పటికే అది రెండు సార్లు వాయిదా వేశారు.

జిల్లా కమిటీలు పునరుద్ధరణ?

టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రారంభించింది. కానీ కొవిడ్‌ లాక్‌డౌన్‌, పలు ఇతర కారణాలతో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నాటికే గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయ్యేలా షెడ్యూల్‌ ప్రకటించినా అదీ అమలుకాలేదు. వినాయక చవితి, దసరా పండగలు, అసెంబ్లీ సమావేశాలు, హుజూరాబాద్‌ ఉపఎన్నిక, శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు తరచూ వాయిదా పడుతోంది. ప్రస్తుతం శాసనమండలి ఎన్నికల ప్రక్రియ 14న యుగియనుండటంతో జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో రద్దుచేసిన జిల్లా కమిటీలను పునరుద్ధరిస్తామని ప్రకటించినా ప్రస్తుతానికి కేవలం జిల్లా కన్వీనర్లను మాత్రమే నియమించే అవకాశం ఉందని అంటున్నాయి.

ఎమ్మెల్సీ’ కోడ్​ముగిశాక

టీఆర్‌ఎస్‌లో మళ్లీ సంస్థాగత పదవుల అంశం తెరపైకి వచ్చింది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ముగిశాక పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల నియామకం చేపట్టే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శాసనమండలి సభ్యత్వాన్ని ఆశించి, అవకాశం దక్కనివారు, తమ రూటు మార్చి నామినేటెడ్‌ పదవులు లేదా పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్య పదవులపై దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికల కోడ్‌ ఈ నెల 15న ముగియనుంది. ఆ తర్వాత పదవుల పందేరం మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇప్పుడు అవకాశం వస్తేనే..

చాలాకాలంగా ఎమ్మెల్సీ, ఇతర పదవులు ఆశించి, అవకాశం రాని నేతలు 2023 సాధారణ ఎన్నికల్లోపు ఏదో ఒక పదవిని దక్కించుకోవడంపై దృష్టిసారించారు. నామినేటెడ్‌ పదవులుగానీ, పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చోటుగానీ దొరికితేనే భవిష్యత్​లో రాజకీయ అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. 2023 సాధారణ ఎన్నికల్లోపు పదవియోగం పొందడానికి ఇదే చివరి అవకాశమన్న అభిప్రాయం కూడా అందరిలోనూ వ్యక్తమవుతోంది.