Breaking News

ఫిట్‌ మెంట్‌ 30శాతం

ఫిట్‌ మెంట్‌ 30శాతం
  • ఏపీ ఉద్యోగులకు శుభవార్త
  • పీఆర్‌సీపై కీలక ప్రకటన
  • 11 అంశాలతో సీఎం జగన్‌కు నివేదిక
  • వెల్లడించిన సీఎస్‌ సమీర్‌ శర్మ

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ శుభవార్త చెప్పింది. 30 శాతం ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎస్‌ సమీర్‌ శర్మ వెల్లడించారు. ఉద్యోగులకు 27శాతం మాత్రమే ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలని.. కార్యదర్శుల కమిటీ నివేదిక ఇచ్చిందని ఈ సందర్భంగా వివరించారు. ఫిట్‌ మెంట్‌ పై ఉద్యోగులకు ఎవరూ కూడా ఆందోళన చెందనవసరం లేదని భరోసా కల్పించారు. ఉద్యోగులు 40 శాతం పైగా ఫిట్‌ మెంట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేయగా ప్రభుత్వం 30 శాతం ఇచ్చేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఏడు రకాల సిఫార్సులు చేశాం. నివేదికలోని 11 అంశాలను అమలు చేయాలి.. ఐదు అంశాలను మార్పులతో అమలు చేయాలనే విషయాన్ని సీఎం జగన్​మోహన్​రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సీఎస్​తెలిపారు.

భారం.. అయినా తప్పదు: సీఎస్​

’రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై విభజన పెనుప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో అది కేవలం రూ. 1,70,215గా ఉంది. రూ.6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉంది. రెవెన్యూ లోటు కింద ఉన్న రూ. 18,969.26 కోట్లు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. రూ.20వేల కోట్ల అదనపుభారం పడింది. ఇంతటి కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్‌ను ఇచ్చింది. ఐఆర్‌ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ప్రభుత్వ విభాగాలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూళ్లు తదితర ఉద్యోగులకూ వర్తింపజేసింది. ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.ఐదు లక్షల రూపాయలు, సహజ మరణానికి రూ.రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా వీరికి అమలు చేస్తోంది. ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ.360 కోట్ల మేర ఏడాదికి అదనపు భారం పడుతోంది’ అని సీఎస్‌ తెలిపారు.