Breaking News

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

జోగుళాంబ సన్నిధిలో సీఎం కుటుంబసభ్యులు

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల(మానవపాడు): అష్టాదశశక్తి పీఠాల్లో ఒకటైన జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్​ జోగుళాంబ అమ్మవారిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసభ్యులు మంగళవారం దర్శించుకున్నారు. అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్​ సతీమణి కల్వకుంట్ల శోభ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ​సతీమణి శైలిమ కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. సహస్ర కలశాభిషేకంలో పాల్గొని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. వసంత పంచమి రోజున కుటుంబసభ్యులతో జోగుళాంబ అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమేనని అన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని ప్రకటించారు. బ్రహ్మోత్సవాల్లో వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాగర్​కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, అలంపూర్​ఎమ్మెల్యే అబ్రహం, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య దంపతులు, రాష్ట్ర పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారి భాస్కర్, రాష్ట్ర కన్స్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రవిప్రకాష్ గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ రాందేవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితకు చీరను అందజేస్తున్న అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం దంపతులు
పూజల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్​ కుటుంబసభ్యులు