Breaking News

‘హైదరాబాద్ కు కిషన్ రెడ్డి ఏమిచేశారు’

రోహింగ్యాలపై తప్పుడు ప్రచారం వద్దు

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో 40వేల మంది రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలు ఉంటే కేంద్ర ఏం చేస్తోందని ప్రశ్నించారు. 18 నెలల కాలంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏమి చేశారని ప్రశ్నించారు. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతి లేదన్నారు. బుధవారం ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ముందు తన నియోజకవర్గం అభివృద్ధిని చూసుకుంటే మంచిదని హితవుపలికారు. కరీంనగర్ లో ఉంటే బండి సంజయ్ కు హైదరాబాద్ గురించి ఏం తెలుసునని విమర్శించారు. హైదరాబాద్ లో సర్జికల్ స్ట్రైయిక్ చేస్తారా? మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం పేదలను ఆదుకుంటుందని చెప్పారు. బీజేపీని చూసి ఎంఐఎం నేతలు మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీలో వారి సంఖ్య ఎంత? వారి బలమెంత? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో జీహెచ్ఎంసీకి సంబంధం లేని హామీలు ఉన్నాయని మంత్రి ఎద్దేవా చేశారు.