Breaking News

సోనియమ్మకే మళ్లీ పగ్గాలు

ఢిల్లీ: కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగకుండానే కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ భేటీ ముగిసింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీనే కొనసాగించాలని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ నిర్ణయం తీసుకున్నది. సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని ఊహాగానాలు వెల్లువెత్తడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అయితే పలు నాటకీయ పరిణామాల మధ్య సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. సోనియాగాంధీ పేరును పార్టీ సీనియర్​ నాయకులు మన్మోహన్​ సింగ్​, ఏకే ఆంటోనీల ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనలకు ​వర్కింగ్​ కమిటీ ఆమోదం తెలిపింది. కాగా కొత్త​ అధ్యక్షుడి ఎంపికకోసం మరోసారి సీడబ్ల్యూసీ సమావేశం కానున్నది.

సీనియర్లపై రాహుల్​ ఆగ్రహం

సీడబ్ల్యూసీ సమావేశం వాడీవేడిగా కొనసాగింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని రాహుల్​ గాంధీ స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్​లో నెలకొన్న పరిస్థితులపై గులాంనబీ ఆజాద్​, కపిల్​ సిబల్​ తదితర సీనియర్​ నేతలు రాసిన బహిరంగ లేఖపై రాహుల్​ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో అంతర్గతంగా చర్చించవలసిన విషయాన్ని ఎందుకు రచ్చ చేశారని మండిపడ్డారు. కొందరు కాంగ్రెస్​ సీనియర్లు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కూడా ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.