Breaking News

వైద్యసదుపాయాలు మెరుగుపడాలె

దేశంలో వైద్యసదుపాయాలు పెరగాలి

సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టిపెట్టాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రధానమంత్రి నరేంద్రమోడీని కోరారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కరోనాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని వివరించారు. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాలని గుర్తుచేశారు.
కరోనా మనకు పాఠం నేర్పింది
‘కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంది. వైద్యరంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాలి. సమగ్ర వైద్యసదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి అమలు చేయాలి. గతంలో కూడా అనేక వైరస్ లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్​లో కూడా వచ్చే అవకాశం ఉంది. వైద్యరంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునేలా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? వంటి విషయాలు ఆలోచించాలి. ఐఎంఏ వంటి సంస్థలతో సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలి. ఇది దేశానికి మంచిచేసే చర్య. కరోనా లాంటివి భవిష్యత్​లో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీనికోసం ప్రధానమంత్రి చొరవ తీసుకోవాలి.’ అని సీఎం కేసీఆర్​ కోరారు.


శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాం
‘తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71శాతం ఉంది. మరణాల రేటు 0.7శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం. కరోనా ప్రబలిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం ఐసీఎంఆర్, నీతిఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం. వైద్యసిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగమంతా శక్తివంచన లేకుండా పనిచేస్తోంది’ అని సీఎం కేసీఆర్​వివరించారు. వీడియోకాన్ఫరెన్స్​లో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి, వైద్యశాఖ విభాగాధిపతులు శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, గంగాధర్, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.