Breaking News

వీఐపీల్లో కరోనా కలవరం

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యుల నుంచి ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు అందరినీ వైరస్ వణికిస్తోంది. రెండు రోజుల క్రితం జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి వైరస్ ప్రబలింది. దీంతో మేయర్ సహా వారి కుటుంబసభ్యులు, ఇతర అధికారులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. తాజాగా మంత్రి హరీశ్‌రావు పీఏకు కూడా కరోనా ప్రబలినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి హరీశ్ రావుతో పాటు కుటుంబసభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. లాక్‌డౌన్ విధించినప్పటి నుంచి మంత్రి హరీశ్ రావు ప్రజలను కరోనా వైరస్ విషయమై చైతన్యవంతుల్ని చేస్తున్నారు. అందరికీ అర్థమయ్యే జాగ్రత్త చర్యలను వివరిస్తున్నారు. నిరంతరం జనంలో తిరుగుతూ వారికి అండగా నిలుస్తున్నారు.

మరోవైపు, మరోవైపు సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్​లోకి వెళ్లారు. ఇటీవల జడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంటన వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ కూడా సెల్ఫ్ క్వారంటైన్​లోకి వెళ్లారు. అటు యాదాద్రి భువనగిరి జడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్​లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు..

వరంగల్​ జిల్లా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో చేరారు. ఎమ్మెల్యే ఆరోగ్యంగానే ఉన్నారని టీఆర్​ఎస్​ జనగామ నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గుజ్జ సంపత్ రెడ్డి తెలిపారు.