Breaking News

వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

వర్షాలు కురుస్తున్నయ్​.. అలర్ట్​గా ఉండండి

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్నందున వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి, మంత్రులతో శనివారం మాట్లాడారు. ఆయా జిల్లాల పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ​మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తుండడంతో చాలా చెరువులు అలుగుపోస్తున్నాయని, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయని, చాలాచోట్ల రోడ్లపైకి నీరు వచ్చి చేరిందన్నారు. హైదరాబాద్ లో రెండు కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని స్థానిక కలెక్టర్, పోలీస్ అధికారులతో కలిసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు. చాలా చెరువులు పూర్తిస్థాయిలో నిండాయని, ఫలితంగా కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, వరదలకు రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి రావొచ్చని సీఎం సూచించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని దాదాపు అన్ని చెరువులు అలుగుపోస్తున్నాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.