Breaking News

రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

రైతువేదికలు, ప్రకృతివనాలు పూర్తికావాలె

సారథి న్యూస్, మెదక్: జిల్లావ్యాప్తంగా రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా వాటిని అందుబాటులోకి తీసుకురావాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు. మంగళవారం జిల్లాలోని ఆయా మండలాల ప్రత్యేకాధికారులు, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయధికారులు, విస్తరణాధికారులతో కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికలు, పల్లె ప్రకృతి వనాల పనులు చాలా వరకు పూర్తి కాకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రైతువేదికల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, అలాగే నిధుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్లను తొలగించి బ్లాక్​లిస్టులో పెట్టడంతో పాటు వేరే వారికి కాంట్రాక్టు పనులను అప్పగించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్ ఈఈ రాంచంద్రారెడ్డి, డీఆర్డీవో శ్రీనివాస్, డీఏవో పరశురామ్​నాయక్, మెదక్, తూప్రాన్ ఆర్డీవోలు సాయిరాం, శ్యాంప్రకాశ్, ఆయా మండలాల ప్రత్యేకాధికారులు దేవయ్య, జయరాజ్, శ్రీనివాసులు, యేసయ్య, గంగయ్య, రసూల్​బీ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు, ఎంపీడీవోలు, ఏవోలు పాల్గొన్నారు.