Breaking News

మిమిక్రీ కళాకారుడు హరికిషన్‌ ఇకలేరు

సారథి న్యూస్​, హైదరాబాద్‌: ప్రముఖ మిమిక్రీ కళాకారుడు, నటుడు హరికిషన్‌ శనివారం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. హరికిషన్‌ మే 30, 1963లో ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులోనే మిమిక్రీ చేయడం మొదలు పెట్టిన హరికిషన్ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై వేల ప్రదర్శనలు ఇచ్చారు. అగ్రనటుడు ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌తో పాటు ఎంతో మంది సినీనటుల గొంతులను ఆయన అనుకరించేవారు.

కేవలం సినిమాల్లో వారు చెప్పిన డైలాగ్‌లు అనుకరించడమే కాదు, కొన్ని చిన్న స్కిట్‌లను వారు చేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించేవారు. అవన్నీ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించేవి. సినీనటులు మాత్రమే కాదు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు చంద్రబాబు, వైఎస్సార్​, కేసీఆర్‌, వీహెచ్‌ తదితర ఎంతోమందిని హరికిషన్‌ అనుకరించి అలరించేవారు. పలు చిత్రాల్లోనూ చిన్నచిన్న పాత్రలు పోషించారు.