Breaking News

తరాల భూముల తగవులకు ముగింపు పలికింది

తరాల భూముల తగవులకు ముగింపు పలికింది

సారథి న్యూస్​, అచ్చంపేట: తరాల భూముల తగవులకు ముగింపు పలికేలా, కొత్త తరాలకు ఏ చిన్న ఇబ్బంది లేకుండా కొత్త చట్టం ఉందని, తెలంగాణ రైతుల కష్టాలు తీర్చడమే ధ్యేయంగా సీఎం రెవెన్యూలో భారీ సంస్కరణలకు సీఎం కె.చంద్రశేఖర్​రావు శ్రీకారం చుట్టారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం అమలు సందర్భంగా.. సీఎం కె.చంద్రశేఖర్​రావుకు సంఘీభావం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం అచ్చంపేటలో నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్​శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రైతులు

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. మనిషికి బతుకునిచ్చిన ఈ నేలకు దశాబ్దాలుగా పడిన సంకెళ్లను తెంచడానికి సీఎం కేసీఆర్​సాహసోపేతంగా అడుగు ముందుకేశారని కొనియాడారు. నూతన రెవెన్యూ చట్టం తెలంగాణ అంతటా ఆకాశమంత సంబురాన్ని తెచ్చిందన్నారు. ఎప్పటికీ పరిష్కారం కావనుకున్న సమస్యలు కళ్లముందే పరిష్కారం కావడంతో అద్భుతంగా కనిపిస్తుందన్నారు. దశాబ్దాల బూజుపట్టిన చట్టాలను తిరగరాసి పారదర్శక పాలనకు పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.