Breaking News

భూమి పేర చేయడం లేదని..

భూమి పేర చేయడం లేదని..

  • పురుగు మందు తాగి అన్నదమ్ముల ఆత్మహత్యాయత్నం
  • మానవపాడు తహసీల్దార్ ఆఫీసు ఎదుట ఆందోళన

సారథి న్యూస్, మానవపాడు: భూమిని తమ పేర చేయడం లేదని, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగినా న్యాయం జరగడం లేదని ఇద్దరు అన్నదమ్ములు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు తహసీల్దార్ కార్యాలయం ఎదుట కలకలం రేపింది. బాధిత రైతుల కథనం మేరకు.. మండలంలోని చెన్నిపాడు గ్రామానికి చెందిన రైతులు శేషిరాజు, నాగరాజుకు గ్రామ శివారులోని సర్వేనం.57 లో 23 గుంటల భూమి ఉంది. తాతముత్తాతల కాలం నుంచి వారసత్వంగా సంక్రమిస్తున్న పొలాన్ని తమ పేర చేయాలని ఏడేళ్లుగా తహసీల్దార్​ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. తిరిగి తిరిగి వేసారిపోయిన సదరు అన్నదమ్ములు తహసీల్దార్​ ఆఫీసుకు వెంట తెచ్చుకున్న పురుగు మందును తాగేందుకు యత్నించారు. ఇది గమనించిన పోలీసులు వారిని వారించారు. ఈ విషయమై డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్ ను వివరణ కోరగా.. సర్వే నం. 57 సంబంధించి వారి కుటుంబసభ్యుల సంబంధించి ఆస్తి పంపకం విషయమై సివిల్ కోర్టులో కేసు ఉన్నందున తామేమీ చేయలేమని చెప్పినా వినడం లేదన్నారు. భూ వివాదం సివిల్ కోర్టులో ఉన్నందున తామేమీ జోక్యం చేసుకోలేమని చెప్పారు.