Breaking News

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

ప్రజలు కోరింది చేయడమే ధ్యేయం

సారథి న్యూస్, మెదక్: ప్రజలు కోరుకున్న పనులను చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు అన్నారు. బుధవారం మెదక్ నియోజకవర్గంలోని నార్సింగి మండలంలో పలు అభివృద్ధి పనులకు మెదక్, నారాయణఖేడ్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీఎంజీఎస్​వై కింద దుబ్బాక నియోజకవర్గానికి మంజూరైన రోడ్డును దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి నార్సింగి మండలానికి మంజూరు చేయించారని గుర్తుచేశారు. నార్సింగి మండల కేంద్రంగా ఏర్పడడానికి ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు కొనసాగాయని వివరించారు. నూతనంగా ఏర్పడిన మండలంలో కొన్ని టెక్నికల్ సమస్యలు ఉన్నాయని, వల్లభాపూర్, కాస్లాపూర్ గ్రామాలను నార్సింగి మండలంలో కలపాలనే ప్రజల కోరికను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తీర్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి వివరించారు. దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటతో పాటు నార్సింగి మండలానికి కాళేశ్వరం నీటిని తెప్పించి ప్రతి చెరువు, కుంటను నింపుతామని స్పష్టంచేశారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
పీఎంజీఎస్ వై కింద రూ.4.15 కోట్ల నిధులతో నిర్మించే నర్సంపల్లి – సుతార్​పల్లి రోడ్డు, డబుల్ బెడ్​రూమ్, నార్సింగి – చిన్నశంకరంపేట రోడ్డు, నార్సింగిలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన, మున్నూరుకాపు సంఘ భవనానికి ప్రారంభోత్సవం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సబిత, జడ్పీటీసీ సభ్యుడు కృష్ణారెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.