Breaking News

పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

పొంగిన వాగులు.. తెగిన రోడ్లు

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని అలంపూర్​నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి నుంచి కురిసిన భారీవర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. అంతర్రాష్ట్ర రహదారి రాయిచూర్ మార్గంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రయాణికులు వెళ్లలేక 40 నుంచి 60 కి.మీ. దూరం మేర గద్వాల మీదుగా ప్రయాణిస్తున్నారు. అలాగే మానవపాడు మండల కేంద్రంలో అమరవాయి వాగు ఉప్పొంగడంతో ఏడు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలోని పత్తి పంటలు నీట మునిగాయి. మానవపాడు పెద్దవాగును తహసీల్దార్ వరలక్ష్మీ, మానవపాడు సర్పంచ్ పరిశీలించారు. వాగు పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బొంకూరు పెద్దవాగును తహసీల్దార్ లక్ష్మి, గ్రామ సర్పంచ్​ శ్రీలత భర్త భాస్కర్ రెడ్డి పరిశీలించారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనదారులు వాగును దాటి వెళ్లకుండా రక్షణ చర్యలు తీసుకున్నారు. లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి వాహనదారులు తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని, వాగు ప్రవాహం వద్ద పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నారు.
ఆర్డీఎస్ కాల్వకు గండి
రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆర్డీఎస్ కాల్వకు గండిపడడంతో పత్తి మిరప, కంది, ఉల్లిగడ్డ, వర్షపు నీటిలో మునిగిపోయాయి. అపారమైన పంటనష్టం వాటిల్లింది. నీట మునిగిన పంటలను నష్టపరిహారం చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలోని భారీ వర్షానికి గద్వాల నుంచి రాయిచూరు వెళ్లే ప్రధాన రహదారిలో నందిన్నె వద్ద మట్టి బ్రిడ్జి నీటి ఉధృతికి తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

నీట మునిగిన పత్తి పంట
నందిన్నె వద్ద కొట్టుకుపోయిన బ్రిడ్జి.. నీటిలో కూరుకుపోయిన లారీ