Breaking News

పారదర్శకంగా ధరణి పోర్టల్

సీలేరును ఏపీలో కలిపి అన్యాయం చేశారు

  • భూముల రిజిస్ట్రేషన్​కు లంచం అవసరం ఉండదు
  • ఏడాదిలోపు భూముల సర్వే
  • మండలిలో సీఎం కె.చంద్రశేఖర్​రావు

సారథి న్యూస్, హైదరాబాద్: భూముల రిజిస్ట్రేషన్​కు ఇకపై లంచం ఇవ్వాల్సిన అవసరం ఉండదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా సోమవారం శాసనమండలిలో కొత్త రెవెన్యూ చట్టాన్ని సభలో ప్రవేశపెట్టి మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల చేతిలో 90శాతానికి పైగా భూములు ఉన్నాయని అన్నారు. 25 ఎకరాలు పైబడి ఉన్న రైతులు కేవలం 6,600 మంది మాత్రమేనని చెప్పుకొచ్చారు. వ్యవసాయ భూములకు సంబంధించి ధరణి పోర్టల్ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు. ఎవరైనా ఎక్కడైనా ఓపెన్​చేసి చూసుకోవచ్చన్నారు. ఏడాదిలోపు భూములను సర్వే చేస్తామన్నారు. అందుకోసం సరికొత్త టెక్నాలజీని వాడుతున్నామని సీఎం కేసీఆర్​ చెప్పారు.

సీఎం కేసీఆర్​కు స్వాగతం పలుకుతున్న మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​రెడ్డి

సీఎంకు స్వాగతం పలికిన మండలి చైర్మన్​
శాసనసభ సమావేశాల సందర్భంగా మండలికి వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావుకు చైర్మన్​గుత్తా సుఖేందర్​రెడ్డి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇక నుంచి ఎలాంటి అవినీతి ఉండబోదన్నారు. ఇకపై తహసీల్దార్లు అవినీతికి పాల్పడే అవకాశం ఉండదని, ధరణి పోర్టల్ లో మార్పులకు తహసీల్దార్​కు అధికారం లేదని స్పష్టంచేశారు. సబ్ రిజిస్ట్రార్​లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని, వివాదాల పరిష్కారానికి కోర్టుకు వెళ్లవచ్చని, కానీ వివాదాలు పెట్టుకునే వారి కోసం ప్రభుత్వం సమయం వృథా చేయొద్దన్నారు. వీఆర్వోల విశేష అధికారాలతో చాలామంది నష్టపోయారని వివరించారు. ఎన్టీఆర్ హయాంలో పటేల్, పట్వారీ వ్యవస్థలను రద్దుచేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ ​గుర్తుచేశారు.