సారథి న్యూస్, హైదరాబాద్: తనపై వచ్చిన లైంగికదాడి ఆరోపణలపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. సోషల్మీడియా, కొన్ని వెబ్సైట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువతిపై 143 మంది లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఇటీవల వెలుగుచూసింది. ఈ ఘటనపై పంజాగుట్ట పీఎస్లో కేసు నమోదైంది. ఈ కేసులో టీవీ యాంకర్ ప్రదీప్ పేరు ప్రముఖంగా వినిపించింది. సోషల్ మీడియాలో యాంకర్ ప్రదీప్పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. దీంతో ఈ అంశంపై గురువారం సాయంత్రం ప్రదీప్ స్పందించారు. ‘ద ట్రూత్’ పేరుతో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్లు నిజానిజాలు తెలుసుకోకుండా తనను నిందితుడిని చేస్తూ వార్తలు రాశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజులుగా తాను, తన కుటుంబం ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నామని చెప్పుకొచ్చారు. తన కుటుంబసభ్యులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తనను కావాలనే ఈ కేసులో ఇరికించారని.. నిజనిజాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.