Breaking News

ధరణితో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్

ధరణితో 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్

సారథి న్యూస్, మెదక్: ధరణి పోర్టల్ పనితీరును మెదక్ ​జిల్లా కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం కౌడిపల్లిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ఏర్పాటు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టిందన్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కోసం అందుబాటులోకి తెచ్చిన పోర్టల్ ద్వారా కేవలం 15 నిముషాల్లోనే పారదర్శకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ అవుతుందన్నారు. ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పట్టా బుక్కును స్లాట్ బుక్ చేసుకున్న వ్యక్తికి అందజేస్తూ ధరణి సేవలను ఆరాతీశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా?, రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగిందా? అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొల్చారం మండలం అప్పాజిపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్​ను డీఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. ధాన్యంలో 17శాతం తేమ మించకుండా చూడాలని సూచించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఇందుకోసం జిల్లాలో 320 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్​ వెంట మెదక్ ఆర్డీవో సాయిరాం, కౌడిపల్లి తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.