Breaking News

తిరుమల శ్రీవారి హుండీకి గండి

తిరుమల శ్రీవారి హుండీకి గండి

సారథి న్యూస్​, తిరుమల: శ్రీవారు.. ప్రపంచంలో అతిపెద్ద కుబేరుడు. ఇది కరోనా కాలం కంటే ముందు. కానీ ఇప్పుడు కరోనా కాలంలో శ్రీవారి హుండీకి గండి పడింది. తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారు కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలు గట్టెక్కించడానికి తిరుమలలో వెలిశారు. స్వామివారిని ఏడాదికి రెండున్నర కోట్ల మందిపైగా భక్తులు దర్శించుకుంటారు. శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకు ఎప్పటికప్పుడు రికార్డు బద్దలుకొట్టేసేది. కానీ ఇప్పుడు రికార్డులే లేవు. మొదట్లో వేల రూపాయలతో మొదలైన శ్రీవారి హుండీ ఆదాయం నాలుగు నెలల ముందు వరకూ లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరుకునేది. స్వామివారికి ఏడాదికి 1,350 కోట్ల రూపాయల ఆదాయం ఒక్క హుండీ ద్వారానే వచ్చేది. కానీ ఇప్పుడు శ్రీవారి హుండీ లెక్క తప్పింది. కరోనా కారణంగా శ్రీవారి ఆలయంలో ఎన్నడూ లేనివిధంగా 80 రోజుల పాటు దర్శనాలు నిలిచిపోయాయి. మార్చి 20వ తేదీ నుంచి జూన్ 7 వరకూ శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. స్వామివారికి ఏకాంతంగానే పూజా కైంకర్యాలు నిర్వహించారు. గడిచిన నాలుగు నెలల్లో టీటీడీకి 1100 కోట్ల రూపాయల ఆదాయం లభించాల్సి ఉంది. కానీ రూ.270 కోట్ల ఆదాయం మాత్రమే లభించింది. దీంతో దాదాపుగా రూ. 800కోట్లకు పైగా ఆదాయానికి గండి పడింది.