Breaking News

ఢిల్లీకి అన్ని విధాలుగా సాయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం భేటీ అయ్యారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌, హెల్త్‌ మినిస్టర్‌‌ హర్షవర్ధన్‌, స్టేట్‌ డిజాస్టర్‌‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కోసం కేంద్రం ఢిల్లీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయపడుతుందని అమిత్‌ షా అన్నారు. ఈ మేరకు బెడ్ల కొరతను అదిగమిచేందుకు 500 రైల్వేకోచ్‌లను కేటాయిస్తున్నట్లు షా ప్రకటించారు. కోచ్‌ల్లో బెడ్లతో పాటు అన్ని ఎక్విప్‌మెంట్స్‌ను ఇస్తామన్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్లు, పల్స్‌ ఆక్సీమీటర్లు తదితర ఎక్విప్‌మెంట్‌ ఇస్తామని భేటీ అనంతరం అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ప్రభుత్వానికి హెల్ప్‌ చేసేందుకు ఐదుగురు సెంట్రల్‌ గవర్నమెంట్‌ అఫీషియల్స్‌ను నియమిస్తున్నట్లు చెప్పారు.

‘ఢిల్లీలోని అన్ని కంటైన్​మెంట్​ జోన్లకు హెల్త్ వర్కర్లు వెళ్లి ఎఫెక్టివ్‌ కాంటాక్ట్‌ మ్యాపింగ్‌ చేస్తారు. దానికి సంబంధించి ఒక వారంలో రిజల్ట్‌ వస్తుంది. కంటైన్​మెంట్​ జోన్‌లోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. టెస్టింగ్‌ శాంపిల్స్‌ సంఖ్యను డబుల్‌ చేస్తాం. వచ్చే వారానికి దాన్ని ట్రిపుల్‌ చేస్తాం’ అని షా ట్వీట్‌ చేశారు. చిన్న హాస్పిటల్స్‌లోని వారికి కరోనా ట్రీట్‌మెంట్‌పై ఫోన్‌లో గైడెన్స్‌ ఇచ్చేందుకు ఎయిమ్స్‌లోని సీనియర్‌‌ డాక్టర్స్‌తో ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం టోల్‌ ఫ్రీ నంబర్‌‌ను కూడా ప్రారంభించనుంది. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కొత్త గైడ్‌లైన్స్‌ రిలీజ్‌ చేస్తామని అమిత్‌ షా చెప్పారు. స్కౌట్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ ఇతర ఆర్గనైజేషన్స్‌కు చెందిన వలంటీర్లును కూడా నియమిస్తామని ప్రకటించారు.

సంతృప్తికరంగా సాగింది: సీఎం కేజ్రీవాల్
అమిత్‌ షాతో జరిగిన మీటింగ్‌ చాలా సంతృప్తికరంగా సాగిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ‘చాలా సంతృప్తికరంగా సాగింది. చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాం. మనం అందరం కలిసికట్టుగా కరోనాకు వ్యతిరేకంగా పోరాడదాం” అని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో కరోనా కేసులు 36వేలకు చేరాయి. చనిపోయిన వారి సంఖ్య 1,214కు చేరింది. దీంతో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేజ్రీవాల్‌, అమిత్‌ షా భేటీ అయ్యారు.