Breaking News

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

చనిపోయాడనుకున్న వ్యక్తి.. క్షేమంగా ఇంటికి

సారథి న్యూస్, ములుగు: పనికోసం ఇంటి నుంచి మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబం సభ్యులు అంతా ఆశలు వదులుకున్నారు. అతడు చనిపోయాడని అంతా భావించారు. కానీ బతికిబట్ట కట్టి క్షేమంగా ఇంటికి చేరాడు. ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ గురువారం మధ్యాహ్న సమయంలో జాకారం వెళ్తుండగా ములుగు జిల్లా గట్టమ్మ సమీపంలోని బస్టాండ్ లో ఓ వృద్ధుడు మాసిన గడ్డం, చిరిగిన బట్టలతో చలికి వణుకుతూ కనిపించాడు. అతని వద్దకు వెళ్లి వివరాలు ఆరాతీయగా.. తనది ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నెడమర్రి మండలం చినవెల్లి గ్రామమని చెప్పాడు.

తస్లీమా తన సన్నిహితులకు చెప్పి నెడమర్రి పోలీస్ స్టేషన్ ఎస్సై తో మాట్లాడి నాగేశ్వర్ రావు పరిస్థితిని వివరించారు. సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలుపగా మూడేళ్ల క్రితం వెళ్లిన వ్యక్తి ఇంటికి రాలేదని వారూ చెప్పారు. అతని కుటుంబసభ్యులు తస్లీమాకు ఫోన్ చేయడంతో సాయంత్రం నాగేశ్వర్ రావు వద్దకు వెళ్లి ఫోన్ మాట్లాడించారు. శుక్రవారం అతని కుమారుడు ప్రసాద్ ను ములుగు పిలిపించి ఎస్సై ఫణి ఆధ్వర్యంలో కుటుంబసభ్యులకు అప్పగించారు. సాయం చేసినందుకు నాగేశ్వర్ రావు, కుటుంబసభ్యులు తస్లీమాకు కృతజ్ఞతలు తెలిపారు.