![కోయిల్సాగర్నుంచి నీటివిడుదల](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/koilsagar-33f.jpg?fit=1144%2C576&ssl=1)
సారథి న్యూస్, దేవరకద్ర: మహబూబ్నగర్ జిల్లాలోని భారీ సాగునీటి పారుదల ప్రాజెక్టు కోయిల్ సాగర్ ఐదు షట్టర్లను ఆదివారం తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఇటీవల కురుస్తున్న భారీవర్షాలకు ప్రాజెక్టులోకి వరద ఉధృతి కొనసాగుతోంది. పెద్దఎత్తున ప్రవాహం వచ్చి చేరుతుండడంతో ముందు జాగ్రత్త చర్యల్లో గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 32.5 ఫీట్లు ఉండగా, ప్రస్తుతం 32 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టుకు కోయిలకొండ, అంకిళ్ల వాగుల నుంచి పెద్దఎత్తున వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం గణనీయంగా పెరిగింది. జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారాం ప్రాజెక్టు వద్దకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. ఆయన వెంట ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ జ్యోతి, ఎస్సై భగవంత్రెడ్డి ఉన్నారు.