Breaking News

కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా?

కేంద్రమంత్రితో సుజనా భేటీ అందుకేనా!

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏపీ బీజేపీ నేత సుజనా చౌదరి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని కలిసినట్టు సమాచారం. ఈ మేరకు వారు ఏ విషయాలపై మాట్లాడుకుని ఉంటారన్నది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు ఇటీవల గవర్నర్​ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ నేతలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేంద్రప్రభుత్వం రాజధానుల విషయంలో జోక్యం చేసుకుంటుందని, గవర్నర్​ ఈ బిల్లును ఆమోదించబోరని వారు గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ గవర్నర్​ నిర్ణయంతో వారంతా షాక్​కు గురయ్యారు. ఈ నేపథ్యంలో సుజనాచౌదరితో కిషన్​రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

సుజనా చౌదరి బీజేపీలో ఉన్నప్పటికీ టీడీపీకి అనుకూలంగానే మాట్లాడుతుంటారు. ఆయన చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని.. ఆయనే సుజనాను బీజేపీకి పంపించారని వైఎస్సార్​సీపీ వర్గాలు ఎంతో కాలంగా ఆరోపిస్తున్నాయి. దేవుడు దిగొచ్చినా అమరావతి రాజధానిగా కాకుండా అడ్డుకోలేరని, బీజేపీ సరైన సమయంలో స్పందించి జగన్​ ప్రభుత్వాన్ని అడ్డుకుంటుందని గతంలో సుజనా ప్రకటించారు. దీంతో బీజేపీ అధిష్ఠానం.. సుజనాకు తలంటినట్టు సమాచారం. అప్పటి నుంచి ఆయన రాజధాని విషయంపై మౌనంగా ఉన్నారు.

తాజాగా, కిషన్​రెడ్డితో సుజనా భేటీ కావడంతో చంద్రబాబు రాజధానిని అడ్డుకోవడానికి ఏదైనా కొత్త ఎత్తు వేశారా అని అనుమానిస్తున్నారు వైఎస్సార్​సీపీ నాయకులు. రాజధాని విషయంలో జోక్యం చేసుకోవడానికి బీజేపీ అధిష్ఠానం అంత సముఖంగా లేదని సమాచారం. అందుకే రాజధాని మార్పు అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పక్కనపెట్టినట్టు బీజేపీలోని ఓ వర్గం భావిస్తోంది. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకుని రాజధాని మార్పును మార్చుతుందోమోనని పలువురు టీడీపీ నాయకులు ఆశపడుతున్నారట.