![కురుమూర్తి జాతరకు రావొద్దు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/kurumurthy-2.jpg?fit=677%2C356&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్నగర్: వచ్చే కురుమూర్తి జాతరకు ప్రజలెవరూ ఆలయానికి రావద్దని, ఇళ్ల వద్దనే పూజలు నిర్వహించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం జడ్పీ మీటింగ్హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కురుమూర్తి జాతర ఉత్సవాలకు మన జిల్లా నుంచే కాకుండా వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈసారి కరోనా నేపథ్యంలో ప్రజలకు ఇళ్లవద్దనే సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించుకోవాలని సూచించారు. ఆలయాధికారులు కరోనా నిబంధనలు పాటించకుండా జాతరకు ప్రజలను అనుమతిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జడ్పీ చైర్మన్ స్వర్ణసుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. కలెక్టర్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సూచించిన విధంగా ప్రజలు జాతరలో పాల్గొనకుండా ప్రచారం చేపట్టి అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో మహబూబ్నగర్ ఆర్డీవో శ్రీనివాస్, కురుమూర్తి ఆలయ ఈవో శ్రీనివాస్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.