Breaking News

ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

ఒకే గొడుకు కిందికి జలవనరుల శాఖ

సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్​వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. మారిన పరిస్థితికి అనుగుణంగా సీఈలు బాధ్యులుగా అధిక ప్రాదేశిక ప్రాంతాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో మాదిరిగా వివిధ విభాగాల కింద కాకుండా జలవనరుల శాఖ ఒక్కటిగానే పనిచేస్తుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్ ​మంగళవారం ప్రగతిభవన్​లో సంబంధితశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో ప్రస్తుతం 13 చీఫ్ ఇంజనీర్ల ప్రాదేశిక ప్రాంతాలు ఉంటే 19కు పెంచాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి, రామగుండం, వరంగల్, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, గజ్వేల్, సంగారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్ కేంద్రాలుగా సీఈ ప్రాదేశిక ప్రాంతాలుగా ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

మెదక్ జిల్లాలోని ఘనపూర్ ఆనకట్టకు వనదుర్గ ప్రాజెక్టుగా పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాకాల ప్రాజెక్టు కింద ఉన్న కాల్వలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన కాల్వలు శిథిలమైపోయాయని, వీటిని పునరుద్ధరించడం ద్వారా 30వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముఖ్యమంత్రికి విన్నవించారు. సమావేశంలో మంత్రులు ఎస్.నిరంజన్ రెడ్డి, ఈటల రాజేందర్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు పాల్గొన్నారు.