![ఏసీబీకి చిక్కిన పాలమూరు మున్సిపల్ కమిషనర్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/MBNR-2.jpg?fit=626%2C381&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్నగర్: ఓ వైపు ఏసీబీ అధికారులు ఆట కట్టిస్తున్నా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. కీసర తహసీల్దార్ నాగరాజు, మెదక్ జేసీ ఉదంతం మరువకముందే మహబూబ్ నగర్ జిల్లాలో మరోపెద్ద అవినీతి తిమింగలం చిక్కింది. పోలీసుల కథనం మేరకు.. మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్ వడ్డె సురేందర్ రూ.1.65 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ లో క్లోరినేషన్ మెటీరియల్ ను అలీ అహ్మద్ అనే వ్యాపారి సరఫరా చేస్తుంటాడు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి కూడా క్లోరినేషన్ కెమికల్ను ఆయనే సరఫరా చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతని టెండర్ పూర్తికావడంతో దాని పునరుద్ధరణ కోసం మున్సిపల్ కమిషనర్ను అలీ కలిశాడు. అయితే రూ.15లక్షల టెండర్ను నామినేషన్ పద్ధతిలో కలెక్టర్తో మాట్లాడి వచ్చేలా చేస్తానని, అందుకు దరఖాస్తు చేయాలని కమిషనర్ చెప్పారు. చెప్పిన విధంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత అందులో 10శాతం అంటే రూ.1.65లక్షలు తనకు ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను కోరారు. దీంతో అలీ అహ్మద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ప్రణాళిక ప్రకారం కమిషనర్ సురేందర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కాగా హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టులో కమిషనర్ను శుక్రవారం ప్రవేశ పెటనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.