Breaking News

ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

 ఏడుపాయలలో వైభవంగా లక్ష దీపోత్సవం

సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పౌర్ణమి వెన్నెలలో ఏడుపాయలకు చేరుకున్న భక్తులు మంజీరా నదితీరంతో పాటు ఆలయానికి వెళ్లే దారికి ఇరువైపులా దీపాలను వెలిగించారు. వీటికి తోడు ఏడుపాయల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్న బండరాళ్లపై సైతం పెద్దఎత్తున ప్రమిదలను వెలిగించారు.

ప్రమిదలను వెలిగిస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ.. వన దుర్గాభవాని మాత భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోందని, అమ్మవారి దర్శనం కోసం తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రావడం సంతోషంగా ఉందన్నారు. వన దుర్గాభవాని మాత దయతో ఈసారి పెద్దఎత్తున వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాయని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో పాపన్నపేట ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్, మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఆలయ సిబ్బంది వేదబ్రాహ్మణులు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి