Breaking News

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

ఇసుకకు ప్రత్యేక కార్పొరేషన్?

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్​ లో ఇసుక తవ్వకాలు, విక్రయాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇందుకోసం కార్పొరేషన్‌కు ఎండీ స్థాయి అధికారిని నియమించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తోంది. ఏపీఎండీసీ ఎండీని ముఖ్య​అధికారిగా నియమించే అవకాశాలు ఉన్నాయి. గనులశాఖ నుంచి జేడీ స్థాయి అధికారి, ఓఎస్‌డీ, ఏపీఎండీసీకి చెందిన కొందరు అధికారులను డిప్యుటేషన్‌పై నియమించనున్నట్లు సమాచారం. నిత్యం ఇసుక తవ్వకాలు, ఆన్‌లైన్‌, గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా బుకింగ్‌, జిల్లాల్లో సంయుక్త కలెక్టర్ల అనుమతితో జరుగుతున్న బల్క్‌ బుకింగ్‌ తదితరాలన్నీ ఈ కార్పొరేషన్‌ కిందకు రానున్నాయి. కొత్త ఇసుక రీచ్‌లు, స్టాక్‌ పాయింట్ల గుర్తింపునూ ఈ సంస్థ ద్వారా చేపట్టనున్నారు. ఈనెల 15న రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరుగుతుండగా, అందులో ఇసుక కార్పొరేషన్‌ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.