Breaking News

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
  • ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు
  • డ్రాప్​ అవుట్స్ ​తగ్గించడం..
  • పౌష్టికాహారం అందించడమే లక్ష్యం
  • జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కొత్త భవనం
  • మంత్రులు, అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్

సారథి న్యూస్, హైదరాబాద్: ఈ విద్యాసంవత్సరం నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాప్​అవుట్స్​ పెరిగిపోతున్నారని వివరించారు. ఈ పరిస్థితిని నివారించడంతో పాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. శుక్రవారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జడ్చర్ల డిగ్రీ కాలేజీలో బొటానికల్ గార్డెన్ అభివృద్ధి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ లెక్చరర్ రఘురాం తన సొంత ఖర్చులతో మధ్యాహ్నం భోజనం పెడుతున్నారని తెలుసుకుని వారిని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషిచేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను కూడా అభినందించారు.

జడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీకి నూతన బిల్డింగ్​ను కూడా ముఖ్యమంత్రి మంజూరు చేశారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో గార్డెన్లను అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్​ ఆదేశించారు. జడ్చర్లలో ఏర్పాటుచేసే బొటానికల్ గార్డెన్ కు అవసరమయ్యే రూ.50 లక్షల నిధులను మంజూరుచేశారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కాలేజీల్లో పనిచేస్తున్న బోటనీ లెక్చరర్లతో సమావేశం ఏర్పాటుచేసి, వారి ఆధ్వర్యంలోనే వివిధ రకాల మొక్కలతో గార్డెన్ అభివృద్ధి చేసే కార్యాచరణ రూపొందించాలని సూచించారు.


సీఎంకు అరుదైన మొక్క బహూకరణ
తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో అరుదుగా పెరిగే ఆండ్రో గ్రాఫిస్ నల్లమలయాన మొక్కను సీఎం కేసీఆర్ కు అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్య బహూకరించారు. సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి ఎస్.నిరంజన్ రెడ్డి, మాజీమంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్ పాల్గొన్నారు.