Breaking News

ఆస్వాదిస్తున్నా.. ఇంకా ఆడతా

న్యూఢిల్లీ: ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం పుట్​బాల్​లో కొనసాగుతానని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి అన్నాడు. ఇప్పట్లో ఆటకు దూరమయ్యే ఆలోచన లేదని, మరో నాలుగేళ్లు కచ్చితంగా ఆడతాననే నమ్మకం ఉందన్నాడు. ‘ఈ తరానికి అవసరమైన ఫిట్​నెస్​తో ఉన్నా. ఆటపై ఆసక్తి పోలేదు. వీడ్కోలు పలకాలనే ఆలోచన కూడా లేదు. ఎవరైనా మెరుగైన ఆటగాడు వచ్చి నా గేమ్​ను శాసిస్తే అప్పుడు ఆలోచిస్తా. అంతవరకు ఫుట్​బాల్​ ఆడడమే నాపని. 15 ఏళ్లు దేశానికి ప్రాతినిథ్యం వహించడం నేను చేసుకున్న అదృష్టం. మరో నాలుగేళ్లు ఆడగలననే నమ్మకం ఉంది. అయితే 20ఏళ్లు పూర్తి చేసుకోవాలన్నది నా కల. జాతీయ జట్టు తరఫున అత్యుత్తమంగా ఆడేందుకు నాశక్తి మేరకు కృషిచేస్తా’ అని సునీల్‌ చెప్పుకొచ్చాడు. ఇండియా తరఫున 115 మ్యాచ్‌లాడిన సునీల్‌ 72 గోల్స్‌ చేశాడు.