Breaking News

ఆషాఢం వచ్చేసింది..

సారథి న్యూస్, రామాయంపేట: అత్యంత దైవభక్తి.. గ్రామదేవతలకు పూజలకు ప్రాముఖ్యం ఉన్న ఆషాఢ మాసం వచ్చేసింది. గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ, నగర ప్రాంతాల ప్రజలు ఈ మాసంలో అత్యంత భక్తి పారవశ్యలో గడుపుతారు. గ్రీష్మరుతువు పోయి వర్షరుతువు వస్తున్న తరుణంలో తొలకరి చినుకులు పుడమి పులకింతల్లో ఆషాఢ మాస ఆగమనం ఎన్నో కొత్త సొబగులను తీసుకొస్తుంది. ప్రకృతి పలకరింపుల పరిమళాలను.. అరచేతిలో పండిన గోరింటాకుల మనసును ముద్దాడుతుంది. నాగలి దున్నిన నేలంతా పులకిస్తూ విచ్చుకునే సమయాన వర్షపు చినుకుల చెలిమితో మట్టి వాసనల వ్యవసాయ పనులు, ఆషాఢ మాస సరిగమల శృతులు వ్యాధులు దరి చేరకుండా ప్రకృతి ఔషధాలతో బోనమెత్తి అమ్మవారి జాతర సంబరాల్లో పదిలమయ్యే సంప్రదాయ మాసం ఇది.
బోనాలకు కరోనా శాపం
ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగకు కరోనా సెగ తగిలింది. కరోనా వైరస్ తెలంగాణలో వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో ఆషాఢ మాస బోనాలను ఆయా ఆలయాల పూజరులే అమ్మవార్లకు సమర్పిస్తారని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంచేసింది.
గోరింటాకు వేడుకలు దూరం
ఈ మాసంలో మగువలు అరచేతిలో గోరింటాకుతో ముచ్చట గోలుపుతాయు. కాలేజీలు, కిట్టి పార్టీలు ఈ మాసంలో గోరింటాకు వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. చుక్కలు, గీతలు, పూల తీగలతో ఇలా ఎన్నో రకాల డిజైన్లతో మగువలు గోరింటాకును అలకంకరించుకుంటారు. ముత్తయిదువల అయిదో తనానికి గోరింటాకు బలమని పెద్దల నమ్మకం. గోరింటాకు పండిన చేతులతో అమ్మవార్లను పూజిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని కొన్నివర్గాల నమ్మకం.
ఆనవాయితీగా ఆషాఢ పట్టు
కొత్త పెళ్లి కూతుళ్లు ఆషాఢ పట్టును అత్తగారింటికి తీసుకొచ్చి వేడుకలా చేసుకుని పుట్టింటికి తీసుకొచ్చే ఆనవాయితీగా పాటించే కుటుంబాలు నేటికి ఉన్నాయి. వ్యవసాయ పనులు జోరుగా సాగే ఈ మాసంలో కొత్త జంటలను ఒకటి కానిస్తే సాగు పనులు సవ్యంగా సాగవని పెద్దల భావన. అందుకే కొత్త కొడళ్లు, అల్లుళ్లకు అత్తవారిల్లు నిషేధం. వ్యవసాయ పనులకు అవరోధాలను నిరోధించేందుకు ఈ ధర్మ బుద్ధి నిషేధమని పెద్దలు చెబుతుంటారు.