
దుబాయ్: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన 29వ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)పై చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కోరు తక్కువే అయినా చివరిలో హైదరాబాద్ బ్యాట్స్మెన్లు తడబాటుతో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాటపట్టి చివరికి పరాజయం మూటగట్టుకున్నారు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ 168 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. బ్యాట్స్మెన్లు సామ్ కరాన్(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు), షేన్ వాట్సన్(42; 38 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లు), అంబటి రాయుడు(41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్లు) రాణించారు. అయితే సీఎస్కేకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డుప్లెసిస్ ఆడిన తొలి బంతికే గోల్డెన్ డకౌట్ అయ్యాడు. చివర్లో ధోని(21; 13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్), జడేజా(25 నాటౌట్; 10 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్)లు ఆకట్టుకోవడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సన్రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, నటరాజన్ ఒక్కొక్కరు రెండు వికెట్ల చొప్పున తీశారు.
లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ 9 పరుగులకే వెనుదిరిగాడు. బెయిర్ స్టో (23, 24 బంతుల్లో 2 ఫోర్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఆ తర్వాత వచ్చిన విలియమ్సన్ (57, 39 బంతుల్లో 7×4), ప్రియమ్గార్గ్(16)తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఆ తర్వాత శంకర్(12), రషీద్ఖాన్(15), నదిమ్(6).. ఇలా ఒకరి తర్వాత మరొకరు వికెట్ల ముందు బోల్తాపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులకే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అలౌట్ అయింది. ఇక సీఎస్కే బౌలర్లలో బ్రావో, శర్మ రెండేసి వికెట్ల చొప్పున తీశారు. కరణ్, జడేజా, ఠాకూర్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.