![సునీల్ రావు.. నీకంత స్థాయి లేదు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/congress-2f-2.jpg?fit=321%2C417&ssl=1)
సారథి న్యూస్, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ, నేతలను విమర్శించే స్థాయి కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు లేదని, ఆ పార్టీ బీసీసెల్ జిల్లా చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వసుపత్రుల పనితీరు మెరుగుపడాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క యాత్ర చేపడితే టీఆర్ఎస్ నేతలు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే కరోనా ఉధృతితో ప్రజలు అల్లాడుతుంటే ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాల్సింది పోయి సిగ్గులేకుండా విమర్శలు చేయడం మేయర్ సునీల్రావుకు తగదన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కనీసం 15 రోజులకు ఒకసారి కూడా ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించిన పాపానపోలేదన్నారు. కరీంనగర్ కు ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరు గురించి ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. మేయర్ తన పదవిని కాపాడుకునేందుకు తాపత్రయ పడుతున్నారని ఎద్దేవాచేశారు.