Breaking News

పెద్దపల్లి జిల్లాను వణికిస్తున్న కరోనా

పెద్దపల్లి జిల్లాను వణికిస్తున్న కరోనా

సారథి న్యూస్, పెద్దపెల్లి: జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పదిరోజుల్లో 43 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. వారిలో ఆరుగురు ఇప్పటికే మృతిచెందారు. మరో ఆరుగురు ఆరోగ్యం నిలకడగా ఉండి కోలుకున్నారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం లాక్ డౌన్లో సడలింపు విధించడంతో జిల్లా అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. దీంతో గుంపులు గుంపులుగా తిరుగుతూ నిబంధనలు పాటించకుండా మాస్కులు ధరించకుండా భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వ కార్యక్రమాల్లో మీటింగ్​లు సమావేశాలు, సభల్లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తున్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు
జిల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పెద్దపెల్లిలో రెండు, సుల్తానాబాద్ లో 10, రామగిరిలో రెండు, కమాన్పూర్ లో ఒకటి, మిగతా మొత్తం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 43 మందికి కరోనా వైరస్ వచ్చినవారిలో ఆరుగురు మృతిచెందారు. కాగా, సుల్తానాబాద్ చెందిన వారిలో నలుగురు, రామగుండం చెందినవారు ఇద్దరు మొత్తం ఆరుగురు ఆరోగ్యంగా నిలకడగా ఉండి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ఐదొందల మంది వరకు సంబంధం ఉన్నట్టు గుర్తించిన వైద్యశాఖ అధికారులు గుర్తించి వారిని హోం క్వారంటైన్​లో ఉంచారు. ఇప్పటివరకు సుమారు మూడొందల మంది నుంచి సేకరించి పరీక్షలకు పంపించారు. వారిలో ఇప్పటివరకు 43 మందికి కరోనా ఉన్నట్టు తేలగా, మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
చేతులెత్తేసిన యంత్రాంగం
లాక్ డౌన్ సడలింపుతో జిల్లాలో ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్నారు. దుకాణాలు, హోటళ్లు, ఇతర మార్కెట్లలో భౌతిక దూరం పాటించకుండా కనిపిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. వాటిలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కూడా మాస్కులు కట్టుకోకుండా కనిపిస్తున్నారు. దీనివల్ల జిల్లాలో గత పదిరోజులుగా కరోనా వైరస్ పెద్దఎత్తున ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తిచెందుతూ విస్తృతమవుతోంది. ఇప్పటికైనా ఎవరి జాగ్రత్తలో వాళ్లు ఉండకపోతే పెద్ద ప్రమాదం తప్పదని డాక్టర్లు, వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.