Breaking News

‘గుడి కూలింది.. సర్కారూ కూలబోతోంది’

గుడి కూలింది... సర్కారూ కూలబోతోంది
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు
  • మహబూబ్​నగర్ , నల్లగొండ జిల్లాల వర్చువల్ ర్యాలీ

సారథి న్యూస్, హైదరాబాద్​: సచివాలయాన్ని కూలగొట్టే క్రమంలో నల్లపోచమ్మ గుడిని కూడా కూలగొట్టారని, అలా కూలగొట్టారంటే కేసీఆర్ ప్రభుత్వానికి దినం దగ్గరపడిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు హెచ్చరించారు. తొందర్లోనే తెలంగాణ ప్రజలు కేసీఆర్ సర్కారుకు దినాలు పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. గుడిని కావాలనే కూలగొట్టి, తప్పిపోయి కూలిపోయిందని అబద్ధాలు చెబుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శుక్రవారం నల్లగొండ, మహబూబ్​నగర్ జిల్లాల వర్చువల్ ర్యాలీకి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నల్లపోచమ్మ గుడి కూలిపోయిందంటే.. టీఆర్‌ఎస్ సర్కార్ కూడా కూలిపోబోతోందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కరోనా బాధితులకు సరైన సౌకర్యాలు కూడా లభించడం లేదని ఆరోపించారు. రోగులకు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ దొరకడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ ఓ ఐటీ హబ్‌గా వెలుగొందుతోందని, అయినా సరే… ఇంటిగ్రేటెడ్ డ్యాశ్ బోర్డ్ లేదని, ఏ ఆస్పత్రిల్లోనూ బెడ్స్‌లేవని విమర్శించారు.  ఇవన్నీ ముందుండి సమీక్షించే, ముందుండి నడిపించే వ్యక్తి తెలంగాణకు కావాలని, కేవలం తుపాకీ దెబ్బలు కొట్టినట్లు మాట్లాడిపోయే ముఖ్యమంత్రితో తెలంగాణ పైకి రాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో 24 గంటలూ ప్రజలతో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఉన్నట్టుండి గాయబ్ అయ్యారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ పిలుపు ఇచ్చినా అందరూ స్పందించారని తెలిపారు. దేశం సరిగ్గా ఉంటేనే పార్టీలకు భవిష్యత్​ఉంటుందని, దేశమే లేకపోతే పార్టీలూ, రాజకీయాలు, ప్రభుత్వాలుండవని మురళీధర్ రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీలు బండి సంజయ్, డి.అరవింద్, మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రరావు పాల్గొన్నారు.