సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్ మెంట్ జోన్ వివరాలను మంత్రికి తెలిపారు. 18 గ్రామాలను కంటైన్ మెంట్ జోన్గా చేశామని వివరించారు. ప్రతి ఇంటిని సర్వే చేస్తూ నమూనాలు సేకరిస్తున్నామని తెలిపారు. కంటైన్ మెంట్ జోన్లలోకి బంధువులు, స్నేహితులు ఎవరు రాకపోకలు సాగించకూడదని సూచించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. వారి వెంట కోవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి ఎంఎం.నాయక్, ఎస్పీ ఆర్ఎన్.అమ్మిరెడ్డి, పాలకొండ ఆర్డీవో టీవీఎస్ కుమార్, దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.