Breaking News

‘ఆన్​లైన్​’ కష్టాలు

సారథిన్యూస్​, హైదరాబాద్​: కరోనా దెబ్బకు ప్రపంచమే తలకిందులయ్యే పరిస్థతి నెలకొన్నది. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు కొనసాగడమే కష్టతరంగా మారింది. ఇప్పటికే ప్రభుత్వాలు పలు పరీక్షలను రద్దుచేసి విద్యార్థులను పై తరగతులకు ప్రయోట్​ చేశారు. ఈ సంవత్సరం కూడా ఇప్పట్లో విద్యాసంస్థలు తెరుచుకొనే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేట్​, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఆన్​లైన్​ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ ఆన్​లైన్​ క్లాసులు వినాలంటే ల్యాప్​టాప్​, కంప్యూటర్​, ట్యాబ్​, లేదా స్మార్ట్​ ఫోన్​ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో ఉన్నత వర్గాలు, మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలకు వాటిని సమకూర్చగలుగుతున్నారు. కానీ ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు బతకడమే భారంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులు చెప్పడం తలకుమించిన భారంగా మారింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు ఫోన్‌ ఉన్నా అవి సాధారణమైనవే ఉన్నాయి. స్మార్ట్​ ఫోన్‌ కొనే స్థోమత లేనివారు చాలామంది ఉన్నారు. కానీ, ఇప్పుడు ఆ కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ చదువులు కొనసాగించాలంటే స్మార్ట్​ ఫోన్‌ తప్పనిసరిగా కొనాల్సి వచ్చింది. ఈ ఫోన్‌ ధర తక్కువలో ఎనిమిది వేలదాకా ఉంటుంది. అసలే కరోనా కాలంలో ఉపాధి దొరకడం లేదు. కుటుంబం బతకడానికే కష్టమవుతున్న తరుణంలో అంత డబ్బు పెట్టి ఫోన్‌ కొనాలంటే ఎలా అని పేద కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే వారు రెండు ఫోన్లు కొనాల్సి ఉంది. పోన్‌ కొనడమే కాదు. దానికి నెట్‌ సౌకర్యం కల్పించాలి. అందుకోసం కనీసం నెలకు 200 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఇంత చేసినా గ్రామాల్లోకి నెట్‌ సిగ్నల్స్‌ సరిగ్గా వస్తాయో రావో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో పిల్లలకు అంత డబ్బులు పెట్టి ఆన్‌లైన్‌ క్లాసులు వినిపించాలంటే తలకుమించిన భారంగా పరిణమించిందని పేద కుటుంబాల వారు ఆందోళనకు గురవుతున్నారు.