![ఎస్సై చొరవతో యువతి సేఫ్!](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/01/final_bjply.jpg?fit=677%2C389&ssl=1)
సారథి న్యూస్, బిజినేపల్లి: కలహాలతో ఓ యువతి పురుగు మందు తాగి చనిపోవాలని అనుకుంది. తన చావుకు కొందరు కారణమని వీడియో తీసి వాట్సప్ గ్రూపుల్లో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఇంతలో ఎస్సైకి విషయం తెలియడంతో ఆమెను అత్యంత చాకచాక్యంతో ప్రాణాపాయం నుంచి రక్షించారు. ఈ ఘటన శనివారం నాగర్కర్నూల్ జిల్లాలో సంచలనం రేపింది. బిజినేపల్లి మండలం సల్కర్పేట గ్రామానికి చెందిన మాధవి వివాహిత. కుటుంబ కలహాలతో ప్రస్తుతం పుట్టిన ఊరులోనే ఉంటోంది. ‘వ్యక్తిగత తగాదాలతో కొందరు నా చావుకు కారణమని’ వీడియో తీసి అదే గ్రామానికి చెందిన కొందరికి పంపించింది. వీడియో స్థానిక వాట్సప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేష్ దృష్టికి వచ్చింది. ఫోన్ కాల్ ఆధారంగా ఘటన స్థలాన్ని గుర్తించి సదరు యువతి ఉన్న ప్రదేశానికి పోలీసు బృందాలను పంపించారు. పరిసర ప్రాంతాల్లో తీవ్రంగా గాలించారు. చివరికి వడ్డెమాన్ గ్రామశివారులో పంట పొలాల మధ్య పురుగు మందు తాగి పడిపోవడం చూశారు. పోలీసులు తమ వాహనంలో మాధవిని హుటాహుటిన నాగర్కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ట్రీట్మెంట్ అందించారు. ప్రస్తుతం బాధిత యువతి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎస్సై వెంకటేష్ సకాలంలో స్పందించిన తీరును చూసి పలువురు అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలోనూ ఎస్సై కృషికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.