Breaking News

మహిళలు తమ సమస్యలపై పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి

# ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ చేస్తే జైలుకేఆకతాయిలు వేధిస్తే షీ టీం కు ఫిర్యాదు చేయండి నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్.

సామాజిక సారథి, నాగర్ కర్నూల్:.జిల్లాలోని మహిళలు, యువతులు ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా షీ టీమ్ ఇంఛార్జి, అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ అన్నారు. గురువారం బిజినపల్లి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి జిల్లా అఢిషనల్ ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళల రక్షణ కోసం షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ టీంలు చురుకుగా పనిచేస్తున్నాయని తెలిపారు. విద్యార్థినులు, మహిళలు వేదింపులకు గురైనప్పుడు భయపడొద్దని, ధైర్యం గా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాల, పాఠశాలల విద్యార్థులకు ర్యాగింగ్, ఈవీటిజింగ్, ఫోక్సో, షీటీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ పై జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించామన్నారు. జిల్లాలో బాలికలు, యువతులు, మహిళలు ర్యాగింగ్ , ఈవ్ టీజింగ్ కి గురి అయినట్లయితే జిల్లా షీ టీమ్ మొబైల్ నంబర్ 87126 57676 లేదా డయల్ 100 ను ఫోన్ చేయాలన్నారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు సైతం తమ కంటే ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది లైంగిక వేదింపులకు గురి చేస్తుంటే తప్పకుండా పోలీసులకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకుండా భయపడుతూ ఉంటే జీవితాంతం అలాంటి వారి వేదింపులకు గురికావాల్సీ వస్తుందన్నారు.మహిళలు సామాజిక మాద్యమాలైన ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వినియోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఫొటో లు, వీడియోలు పోస్టుచేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించి అన్ని రకాల చర్యలు తీసు కోవాలని సూచించారు. ఏదైనా ఇబ్బందులు, వేధింపులపై ఫిర్యాదు చేసేవారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

జిల్లాలో తరుచు నేరాలు జరిగే ప్రదేశాలను హాట్ స్పాట్ లుగా గుర్తించి ఇట్టి హాట్ స్పాట్ ల వద్ద పోలీసులు మఫ్టీ లో తిరుగుతూ ఆకతాయిలను గుర్తించి పట్టుకుంటామన్నారు. అనంతరం వారిలో మార్పు కొరకై వారి తల్లిదండ్రుల సమీక్షంలో కౌన్సెల్లింగ్ నిర్వహించి వారి తప్పును తెలుసుకుని మార్పు వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లలో ఎక్కడి నుండి అయిన క్యూఆర్ కొడ్ ను స్కాన్ చేసి ఆన్ లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆపద, సాయం కావాల్సీన సమయంలో డయల్ 100 నెంబర్ కు కాల్ చేస్తే పోలీసు వారు వచ్చి తప్పకుండా వారి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. టీనేజ్ అమ్మాయిలు, యువతులు, మహిళలు అపరిచిత వ్యక్తులతో, గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకోకుండా జాగ్రతగా ఉండాలన్నారు. కార్యక్రమం లో ఎస్ ఐ నాగ శేఖర్ రెడ్డి , విజయలక్ష్మి, వెంకటయ్య , శ్రీదేవి , యశ్వంత్ , కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.